Saturday, June 27, 2020

అనంతపురంలో కార్మిక సాహిత్యంపై సదస్సు



       

          సాహిత్య అకాడమీ, సాహితీస్రవంతి కలిసి కార్మిక
సాహిత్యంపై ఒక రోజు సదస్సును అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో 15-12-2016 ఆదివారం నాడు ఒక రోజంతా   సదస్సు నిర్వహించాయి.
            ప్రారంభ సమావేశానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లిరవి విచ్చేశారు.  సింగమనేని నారాయణ (కార్మికకథలు). మేడిపల్లి రవికుమార్ (కార్మికకవిత్వం) శ్రీమతి సంజీవమ్మ (కార్మిక నవలలు), శాంతారావు (కార్మిక నాటకాలు)  వారికి కేటాయించిన అంశాలపై ప్రసంగించారు.  సాహితీ స్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి వల్లెపు రవిచంద్ర ఆహ్వానం పలికారు.
               అధ్యక్షత వహించిన పిల్లా కుమారస్వామి  మాట్లాడుతూ కార్మికుల సాహిత్యం మొత్తం సాహిత్యంలో చూస్తే చాలా తక్కువగా ఉందని ఆ లోటును పూడ్చడానికి సాహిత్యకారులు కార్మికుల సంబంధించి విరివిగా రచనలు చేయాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, జీవనపోరాటాల గురించి సాహిత్యంలోకి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలిపారు. అస్థిత్వవాదాలపై చర్చ జరిగినంతగా కార్మిక సాహిత్యం పై జరగలేదన్నారు. కార్మిక సాహిత్యం పై చర్చ జరిగితే ఆస్థిత్వవాదాలు వెనుకబడు తాయని ఆయన చెప్పారు.
             గురజాడ కన్యాశుల్కంలో ప్రస్తావన కొచ్చిన శ్రమ గురించి అంశాల వారీగా వివరించారు రాచపాళెం గారు.
తెలకపల్లి రవి గారు ప్రసంగిస్తూ శ్రమ అనేది సాహిత్యంలో ఎంత వరకు ప్రతిఫలించిందని పరిశీలిస్తే రాజుల కాలంలో రాజులకు సంబంధించిన అంశాలు తప్ప శ్రమజీవుల గురించి ఏమాత్రం కనిపిందన్నారు.భక్తి సాహిత్యంలో అక్కడక్కడ తమకు తెలియకుండానే శ్రమజీవుల గురించి రాశారన్నారు. పోతన రాసిన భాగవతంలో కొన్ని ఉదాహరణలు వివరించారు. సోవియట్ రష్యాలో కార్మికుల రాజ్యం ఆవిర్భవించాక శ్రామికుల గురించి సాహిత్యంలోకి ప్రవేశించిందన్నారు. 1922లో మాలపల్లి నవలలు, 1934,35లో వచ్చిన అమ్మ నవల అనువాదం ద్వారా, 1934లో శ్రీశ్రీ రచనలు ద్వారా శ్రామిక సాహిత్యం తెలుగులోనికి వచ్చిందన్నారు.

           రెండో సెషన్లో   సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రగతి అధ్యక్షత వహించారు.కార్మికుల కథల పై  సింగమనేని నారాయణ మాట్లాడుతూ సాహిత్యాన్ని శ్రామికకోణం నుంచి
చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. . మార్క్స్ భావజాలం మూలంగానే శ్రామిక దృక్పథం చాలా మందిలో ఏర్పడింది.
కె.సభా రాసిన కథల్లో ఎక్కువ భాగం వ్యవసాయ కార్మికుల గురించే ఉందన్నారు. మధురాంతకం రాజారాం
శ్రమజీవులకు సంబంధించిన అనేక కథలు రాశారు. తెలంగాణా ప్రాంతం నుంచి చేనేత కార్మికులు, వృత్తిదారుల కథలు విరివిగా వచ్చాయన్నారు. కల్లుగీత, వడ్రంగి, కమ్మరి, కుమ్మరుల కథావస్తువులు వచ్చాయన్నారు. మధురాంతకం
నరేంద్ర భవన నిర్మాణ కార్మికుల గురించి కథలు రాశారన్నారు. శ్రమకు గౌరవం ఇవ్వగలిగిన సాహిత్యం శ్రామిక
సాహిత్యమన్నారు. ప్రపంచం శ్రమమూలంగానే నడుస్తున్నదని చెప్పినవాడు మార్క్స్ .మానవ చరిత్ర నిర్మాతలు శ్రామికులే నన్నారు.

          కార్మిక నాటక సాహిత్యం సెషన్‌కు ప్రముఖ నాటక రచయిత యక్కలూరి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ప్రధానవక్త శాంతారావు కార్మిక నాటక సాహిత్యంపై ప్రసంగించారు. శ్రమసాహిత్యం గురించి మాట్లాడాలంటే
మొదట వేమన నుంచి చెప్పుకోవాలన్నారు. శ్రీశ్రీ నుంచి మాట్లాడుకోవాలన్నారు. శ్రామికులకు సంబంధించి మా భూమి,
ముందడుగు నాటకాలు వచ్చాయన్నారు. రక్తకన్నీరు. జగన్నాథ రథ చక్రాలు వంటి నాటకాలు ప్రజలను కదలించాయి.
సప్దర్ హష్మి నాటకం పూర్తిగా వీధినాటకం. ప్రజల మధ్యన ఉంటూ ఎలాంటి స్టేజి లేకుండా వేసే నాటకం వీధి నాటకం.
కళాజాతలు జరిగినప్పుడు నాటకాలు వేస్తే జనం నాటకంలో పాత్రలతో కలసిపోయేవారు. 'కార్మికులారా ఏకం కండి'
అంటే ప్రజలు కూడా ఏకంకండి' అనే నినాదాలు ఇచ్చేవారు. ప్రపంచీకరణతో జీవితం సంక్షోభ భరితం అవుతున్న వేళ
ప్రజలకు ఆశను,  ధైర్యాన్ని ఇచ్చే నాటకం రావాలి. మీడియాను వదలి ప్రజలు నాటకాలు చూసే దశ రావాలంటే కొత్తగా
రాయాలి. భార్య చనిపోతే మోసుకుపోయే పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉంది. ఇలాంటి అమానవీయ దృత్యాలపై ప్రజలు
స్పందించే విధంగా మనం నాటకాలు రాయాలి, వేయాలి.
ప్రముఖకవి ఏలూరి ఎంగన్న దానికి స్పందనగా కొన్ని నాటకాల గురించి వివరించారు. పాలేరు, నంది, ముఠామేస్త్రీ
పంటి నాటకాలు శ్రామికుల గురించి రాసినవన్నారు. వాటిని ప్రదర్శించినప్పుడు ప్రజలు బాగా స్పందించారన్నారు.
              భోజనానంతరం జరిగిన కార్మిక కవిత్వం సెషనుకు  కవి నాగేంద్ర అధ్యక్షత వహించారు.డా|| మేడిపల్లి రవికుమార్, కార్మిక కవిత్వంపై ప్రసంగించారు. నన్నయ కాలం నుంచి తెలుగు సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల అంతకు ముందున్న సాహిత్యం మరుగునపడి పోయిందన్నారు. నన్నయకు ముందు విశేషమైన జూనపద సాహిత్యం ఉంది. అందులో శ్రామికుల గీతాలే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఆ గేయాలను కవిత్వాలుగా శ్రామికులే పాడారు.  వారి సమిష్టి సంపద అది. శ్రామిక కవిత్వం పై పెద్దగా పరిశోధన లేదు. కేవలం దళితవాదం, స్త్రీవాదం బహుజనవాదం పై జరిగిన పరిశోధన శ్రామికుల కవిత్వంపై పెద్ద చర్చ జరగలేదు. దీనిని విశ్వ విద్యాలయాలు పట్టించుకోవాలన్నారు.
             కార్మిక నవలా సాహిత్యం'పై సభ కొనసాగింది. ఈ సభకు ప్రముఖ కథారచయిత్రి శశికళ అధ్యక్షత వహించారు. ప్రధానవక్త డా॥ సంజీవమ్మ గారు హాజరయ్యారు. ఆమె అక్కినేని కుటుంబరావు రచించిన 'కార్మికగీతం' నవలపై, శిరంశెట్టి కాంతారావు రచించిన 'వ్యూహం' నవలలపై కూలంకుషంగా చర్చించారు. ఇవి రెండూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రధాన నవలలు.కార్మిక సాహిత్యం సంబంధించిన నవలలు తక్కువగా ఉన్నాయన్నారు. కార్మికగీతం 'సిటు' (సి.ఐ. టి.యు.) సంస్థ ప్రచురించిందని చెప్పారు. దీనిలో కార్మికులు పడే బాధలు, వాటి నుండి బయటపడటానికియాజమాన్యంతో చేసే పోరాటాలు, చట్టాలు మొదలైనవి ఉన్నాయన్నారు. వ్యూహం నవల చదివితే కార్మికులు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారా? అని బాధ కలుగుతుందన్నారు. నవల ప్రారంభమే ఒక భీభత్స దృశ్యంతో ప్రారంభమవుతుంది. కార్మికుడు నిర్మాణంలో వున్న ఏడు అంతస్థుల టవర్ పై పనిచేస్తూ పై నుంచి జారి కిందకు పడుతూ కడ్డీలపై బడి దాన్లో ఇరుక్కొని చనిపోయే సంఘటనతో నవల ప్రారంభమువుతంది. ఆ కార్మికునికి నష్టపరిహారమిప్పడానికి యాజమాన్యం ఒప్పుకోదు. సంఘాలు ప్రవేశిస్తాయి. కొన్ని సంఘాలుగా నటిస్తూ కార్మికులకు ద్రోహం చేస్తుంటాయి. ఒక సంఘం నికరంగా నిలబడి ఆ కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తారు. ఇలా సాగుతుంది నవల అని చెప్పారు. ఈ నవలలో యజమానుల వ్యూహాలు ఎత్తగడలు తెలుస్తాయన్నారు.
            జనరల్ కార్మిక సాహిత్యంపై ప్రఖ్యాత కథ, నవలా రచయిత, కవి, నాటక రచయిత, పాటల రచయిత అయిన తెలకపల్లి రవి కార్మికవర్గ సాహిత్యం గురించి సోదాహరణంగా చెప్పారు. మార్క్సిస్టు అయితేనే కార్మికుల గురించి రాయ గలడని చెప్పడం అంత సవ్యంగా లేదన్నారు. మార్క్సిజం తెలియకపోయిన, మార్క్సిస్టు కాకపోయిన వారుకూడా, శ్రామిక సాహిత్యం రాశారన్నారు. వివిధ అస్థిత్వ వాదాలు చర్చల్లో వున్నా కూడా శ్రామిక సాహిత్యం గురించి చర్చలేదన్నారు. విశ్వవిద్యాయాలు విద్యార్థులచే ఈ దిశగా పరిశోధనలు చేయించటం అవసరమన్నారు. కార్మిక సాహిత్యం రూపొందించ డానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాహిత్య అకాడమీ ఇలాంటి వారికి చేయూతనివ్వదం ఎంతో గొప్ప విషయమన్నారు.
           పిళ్లా కుమారస్వామి వందన సమర్పణతో లిటరరీ ఫోరమ్ కార్యక్రమం ముగిసింది.

No comments:

Post a Comment